-->

పెండింగ్ కేసుల పరిష్కారం కోసం 90 రోజుల మధ్యవర్తిత్వ డ్రైవ్ ప్రారంభం

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ వెల్లడి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం కోసం జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 90 రోజులపాటు మధ్యవర్తిత్వం డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్, కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని "దేశం కోసం మీడియేషన్" అనే పేరుతో నల్సా (NALSA), న్యూఢిల్లీ మరియు సుప్రీంకోర్టు మీడియేషన్ & కన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంలో కక్షిదారులకు డబ్బు, సమయం, మరియు సత్వర న్యాయం లభిస్తుందని స్పష్టం చేశారు. వివాహ బంధానికి సంబంధించిన వివాదాలు, ప్రమాద క్లెయిమ్స్, గృహహింస కేసులు, చెక్ బౌన్స్ కేసులు, సివిల్ మరియు క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, రుణ రికవరీ కేసులు మొదలైనవి ఈ డ్రైవ్‌లో పరిష్కరించవచ్చని వివరించారు.

ఈ అవకాశాన్ని కక్షిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మరియు తమ కేసుల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు.

Blogger ఆధారితం.