హెచ్.ఎం సస్పెన్షన్, ఎంఈవోకు షోకాజ్ నోటీసులు జారీ
నాగర్కర్నూల్, నవంబర్ 11: పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీశైలంను విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ, ఇన్చార్జి ఎంఈవో శ్రీనివాస్రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిపారు.
ఇటీవల పాఠశాల పుస్తకాలను తీసుకువస్తున్న బొలెరో వాహనం బోల్తా పడగా ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటనపై జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను పాఠ్యపుస్తకాలు తెప్పించేందుకు పంపడం అత్యంత నిర్లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ ఘటనలో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడం పట్ల కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేసి, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్య సంఘటనలు చోటుచేసుకోకూడదని అధికారులను హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు హెచ్.ఎం శ్రీశైలంను సస్పెండ్ చేయగా, ఎంఈవో శ్రీనివాస్రెడ్డికి కారణం చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

Post a Comment