పాల్వంచలో సురక్షిత మంచినీటి కేంద్రం ప్రారంభించిన నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్
పాల్వంచ, నవంబర్ 12: నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ తన సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల భాగంగా పట్టణ ఆరోగ్య కేంద్రం — శేఖర బంజర్ వద్ద 100 లీటర్ల సామర్థ్యం గల సురక్షిత మంచినీటి కేంద్రం మరియు సబ్మెర్సిబుల్ మోటార్ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ తుకారాం రాథోడ్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణకుమారి మాట్లాడుతూ గత సంవత్సరం రోజులుగా ఆరోగ్య కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ విషయం 'నవ లిమిటెడ్' యాజమాన్యానికి తెలియజేయగానే వారు సత్వరమే సురక్షిత మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సదుపాయంతో రోగులకు పరిశుభ్రమైన నీరు లభించి, నీటివల్ల వచ్చే వ్యాధులు నివారించవచ్చని పేర్కొన్నారు.
ముఖ్య అతిథి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ “ఇప్పటివరకు నేను పని చేసిన ఏ జిల్లాలోనూ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల కోసం ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం చూడలేదు” అని 'నవ' గ్రూప్ సేవాభావాన్ని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ (CSR) ఎం.జీ.ఎం. ప్రసాద్ మాట్లాడుతూ, “ఇప్పటికే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి, రామవరం తల్లి-పిల్లల ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ పాయింట్లు ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం ఆధునిక వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయనున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్ డీ.జీ.ఎం (HR) శ్రీనివాసరెడ్డి, శేఖర బంజర్ గ్రామ పెద్ద బాలు నాయక్, కిషోర్, గాంధీనగర్ గ్రామ పెద్దలు రాము, లాలు, శంకర్, కిషన్, సిఎస్ఆర్ సిబ్బంది రాజేష్, వెంకన్న, బాలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Post a Comment