-->

కాగ్‌ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం

 

కాగ్‌ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం

దిల్లీ: ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి చేపట్టారు. కాగ్‌ (CAG) అధిపతిగా గురువారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు..

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు.

అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదివారు. 1989లో ఐఏఎస్‌ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికై, ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2021 సెప్టెంబరు నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు.

ఐఏఎస్‌ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సిఉండగా, సంజయ్‌ సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. సంజయ్‌మూర్తి తండ్రి కేఎస్‌ఆర్‌ మూర్తి 1996లో కాంగ్రెస్‌ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793