విద్యార్థులకు షీ టీమ్స్ బాలికల భద్రత, చట్టపరమైన హక్కులు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
విద్యార్థులకు షీ టీమ్స్ బాలికల భద్రత, చట్టపరమైన హక్కులు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
పాపన్నపేట, సెప్టెంబర్ 2: మహిళలు, బాలికల భద్రత, చట్టపరమైన హక్కులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మెదక్ సబ్ డివిజన్ షీ టీమ్స్ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ZPHS యూసుఫ్పేట పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా షీ టీమ్స్ బృందం విద్యార్థులకు మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించింది. పాఠశాల, కళాశాలలకు వెళ్లే సమయంలో లేదా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. వేధింపులు, ఈవ్టీజింగ్, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు వంటి అంశాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
అలాగే సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్స్ సిబ్బంది సూచించారు. అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్లో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, పాస్వర్డ్లు, ఓటీపీలు తదితర సమాచారాన్ని పంచుకోవద్దని చెప్పారు. సోషల్ మీడియా ఖాతాల గోప్యతా సెట్టింగులను సురక్షితంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికలకు సంబంధించిన సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు తమ చుట్టూ జరిగే అన్యాయాలు, వేధింపులపై స్పందిస్తూ, అవసరమైన సందర్భాల్లో పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు షీ టీమ్స్ బృందంతో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణ, బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగంపై అవగాహన పెంపొందించారు.

Post a Comment