-->

ఎస్సీ కులాల జడ్పిటిసి, ఎంపీటీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి

ఎస్సీ కులాల జడ్పిటిసి, ఎంపీటీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి


తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ (అనుసూచి జాతుల) ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని, వారి రాజకీయ ప్రాతినిధ్యానికి రిజర్వేషన్లు అమలు చేయాలని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్  విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం (మే 29) రోజున కొత్తగూడెం సింగరేణి గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ను కలిశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో తొలగించబడిన స్థానిక రాజకీయ రిజర్వేషన్లను తిరిగి అమలు చేయాలని, ముఖ్యంగా జడ్పిటిసి (జిల్లా పరిషత్ టెరిటోరియల్ కన్స్టిట్యూయెన్సీ) మరియు ఎంపీటీసీ (మండల పరిషత్ టెరిటోరియల్ కన్స్టిట్యూయెన్సీ) స్థానాల్లో ఎస్సీ కులాలకు న్యాయం జరగాలని కోరారు.

ఈ సందర్బంగా మంత్రి సీతక్క మరియు ఎంపీ బలరాం నాయక్ స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, వారికి సమాన న్యాయం అందించడానికి కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, అదిలాబాద్ జిల్లాల్లోని సుమారు 10 లక్షల జనాభా కలిగిన 75 ఏజెన్సీ మండలాల్లో ఎస్సీ కులాలకు ప్రాతినిధ్యం లేకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని బొమ్మెర శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ జనాభా పెరిగిన నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ ను 20 శాతం వరకూ పెంచాలని కూడా డిమాండ్ చేశారు. ఎస్సీ రైతులు సాగు చేస్తున్న భూములకు మరియు నివాస స్థలాలకు పూర్తి హక్కులు కల్పించాలని, ఇటువంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కోరిపల్లి శ్రీనివాస్ మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. అలాగే షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితికి చెందిన నాయకులు చలిగంటి కొమరయ్య, రాసమల్ల నరసయ్య, సుందర్ పాల్, ఉండేటి దేవరాజు, కండె రాములు, ఇనగంటి శ్రీనివాస్, దేవరకొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.