కొత్తగూడెం మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీను మున్సిపల్ కార్పొరేషన్గా అభివృద్ధి చేస్తూ జీవో విడుదల చేసింది. రాష్ట్ర శాసనసభలో గత నెలలోనే ఈ బిల్లును ఆమోదించగా, తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ కొత్త కార్పొరేషన్లో కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, అలాగే సుజాతనగర్ మండలంలోని ఏడుపంచాయతీలు కలుపుకొని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారికంగా ప్రకటించారు.
జనాభా వివరాలు:
- కొత్తగూడెం మున్సిపాలిటీ – 97,337 మంది
- పాల్వంచ మున్సిపాలిటీ – 89,721 మంది
- సుజాతనగర్ పంచాయతీలు (7) – 11,124 మంది
- మొత్తం జనాభా – 1,98,182 మంది
ఈ జనాభా లెక్కల ఆధారంగా కొత్తగూడెం కార్పొరేషన్ హోదా పొందింది. ఇది భౌగోళిక విస్తీర్ణం, ప్రజా అవసరాలు, అభివృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకొని తీసుకున్న నిర్ణయంగా ప్రభుత్వం పేర్కొంది.
కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్కు కొత్తగూడెం మున్సిపాలిటీ కమిషనర్ సుజాతను కార్పొరేషన్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. ఈ తాజా ప్రకటనతో స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని, పట్టణానికి మరింత శుభ్రత, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంధర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభివృద్ధి సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. కొత్తగూడెం ప్రాంత అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలవనుందని విశ్లేషకుల అభిప్రాయం.
Post a Comment