BMW కారు కోనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక స్థితిని పట్టించుకోకుండా, విలాసవంతమైన BMW కారు కోనివ్వలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
చాట్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య, కనకమ్మ దంపతుల కుమారుడు జానీ (21) పదవ తరగతి వరకు చదివాడు. అనంతరం తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా తనకు BMW కారు కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురాగానే కుటుంబంలో కలకలం మొదలైంది.
తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితిని వివరించి, BMW కారు కొనడం తమ వల్ల కాదని, బదులుగా స్విఫ్ట్ డిజైర్ కారు కొనివ్వగలమని చెప్పారు. కానీ జానీ ఆ విషయాన్ని అంగీకరించలేదు. తల్లిదండ్రుల ప్రతిస్పందనతో తీవ్రంగా మనస్తాపానికి గురైన జానీ, శనివారం పొలంలో పని చేస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.
ఆత్మహత్య విషయం తెలిసిన గ్రామస్తులు, బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. తల్లిదండ్రులపై ఆర్థిక ఒత్తిడిని పెంచడం, యువతలో వాస్తవికత కోల్పోవడం వంటి అంశాలపై ఈ ఘటన ఆలోచించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తోంది.
Post a Comment