-->

బస్సు దగ్ధం కలకలం – సరస్వతి పుష్కరాల నుండి వస్తుండగా ప్రమాదం

బస్సు దగ్ధం కలకలం – సరస్వతి పుష్కరాల నుండి వస్తుండగా ప్రమాదం


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న బస్సు అగ్ని ప్రమాదం కలకలం రేపింది. కాలేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లి, తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ప్రయాణికులతో నిండిన ప్రైవేట్ టూరిస్ట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 36 మంది భక్తులు పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ దర్శనం పూర్తి చేసుకుని తిరిగి సిరిసిల్లకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మద్దులపల్లి వద్ద బస్సు వెళ్లుతుండగా, ఏసీ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదం సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. బస్సు మంటల్లో ఆవిరైపోతున్న సమయంలో డ్రైవరు వెంటనే బస్సును ఆపి, ప్రయాణికులను సమయాన కిందికి దించి ప్రాణాపాయం తప్పించాడు. అయితే, మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులోని సీట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అగ్ని ప్రమాదం కారణంగా బస్సు పూర్తిగా కాలిపోయినప్పటికీ, ప్రయాణికులెవరికీ శారీరక నష్టం కలగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. విద్యుద్ వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Blogger ఆధారితం.