-->

మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన – ఏడుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన – ఏడుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు


ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి విడుదలైన ప్రకటనలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించిన వివరాల ప్రకారం, విధి నిర్వహణలో ఉన్న కల్లూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా ఎస్సై హరితపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన జూన్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం జరిగింది. తల్లాడ గ్రామానికి చెందిన రాయల రామారావు అనే వ్యక్తి కొంతమంది యువకులతో కలిసి మద్యం మత్తులో కల్లూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న చౌదరి హోటల్ వద్ద గొడవకు దిగాడు. దీనిపై హోటల్ యజమాని మాగంటి బోసుబాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కల్లూరు పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 102/2025 నంబరుతో BNS సెక్షన్లు 329(4), 296(b), 79, 189 (2) r/w 190 కింద కేసు నమోదు చేశారు.

కేసు విచారణ నిమిత్తం ఎస్సై హరిత ఘటనాస్థలికి వెళ్లిన సమయంలో, రాయల రామారావు తన అనుచరులతో మళ్లీ అక్కడకు వచ్చి హోటల్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా, హోటల్ ముందే కూర్చుని న్యూసెన్స్ సృష్టించాడు. ఈ సమాచారంతో మళ్లీ అక్కడకు చేరుకున్న ఎస్సై హరిత, వారిని నియంత్రించేందుకు ప్రయత్నించగా, రాయల రామారావు మరియు అతని అనుచరులు మద్యం మత్తులో ఎస్సైకు ఎదురుగా దౌర్జన్యంగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిని దూషిస్తూ, దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఎస్సై ఫిర్యాదు మేరకు మరో కేసును క్రైం నంబర్ 103/2025 కింద BNS సెక్షన్లు 74, 189, 191(2), 195, 132, 351(2), 2/2 190, See 7(1) కింద నమోదు చేశారు. మొత్తం 10 మందిపై కేసు నమోదు కాగా, ప్రధాన నిందితుడు రాయల రామారావుతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేసి న్యాయ రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ‘‘విధుల్లో ఉన్న పోలీసులకు విఘాతం కలిగించే వారు ఎవరిదైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళా పోలీసులపై దౌర్జన్యాన్ని సహించేది లేద’’ అని హెచ్చరించారు. రాయల రామారావుపై గతంలో తల్లాడ పోలీస్ స్టేషన్‌లోనూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.


Blogger ఆధారితం.