హైదరాబాద్లో అదృశ్యమైన యువకుడు మృతదేహంగా లభించిండు.. హిజ్రాలపై అనుమానాలు
హైదరాబాద్లో అదృశ్యమైన యువకుడు మృతదేహంగా లభించిండు.. హిజ్రాలపై అనుమానాలు
హైదరాబాద్ నగరంలో అదృశ్యమైన ఓ యువకుడు కొద్ది రోజుల తర్వాత శవంగా కనిపించిన ఘటన కలకలం రేపింది. పాతబస్తీ మీర్చౌక్కు చెందిన యువకుడు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో మృతదేహంగా లభించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనలో హిజ్రాల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మీర్చౌక్ ప్రాంతానికి చెందిన ఫిర్దోస్ ఖాన్ రెండో కుమారుడు ఒవేజ్ ఖాన్ (26) ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. అతనికి కొంతకాలంగా హిజ్రాలతో పరిచయాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
గత నెల 27వ తేదీ రాత్రి అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ద్విచక్ర వాహనంపై స్థానిక దుర్రు షెహవర్ ఆసుపత్రి వద్ద దింపిన అనంతరం ఒవేజ్ ఖాన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై బంధువులు, స్నేహితుల వద్ద గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు.
తరువాతి రోజు (జూన్ 28) రాత్రి సర్దార్నగర్ షీప్ మండి సమీపంలో ఒవేజ్ ఖాన్ ఉపయోగించిన ద్విచక్ర వాహనం అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది. దీంతో కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరిగింది. జూన్ 29న అతని తండ్రి ఫిర్దోస్ ఖాన్ మీర్చౌక్ పోలీస్స్టేషన్లో కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో బుధవారం పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒవేజ్ ఖాన్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువకుడు హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతని ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ దృశ్యాలు, పరిచయస్తుల వివరాలను సేకరిస్తున్నారు.
ఒవేజ్ ఖాన్కు హిజ్రాలతో ఉన్న పరిచయాల కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment