మద్యం సేవించి వాహనాలు నడిపిన 26 మందికి జరిమానా విధించిన కోర్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కోర్టులో మద్యం సేవించి వాహనాలు నడిపిన 26 మందికి జరిమానాలు విధిస్తూ శుక్రవారం ప్రత్యేక న్యాయమూర్తి, జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ మెండు రాజమల్లు గారు తీర్పు ప్రకటించారు.
కొత్తగూడెం వన్టౌన్ ఎస్ఐ తుంగ రాకేష్ కథనం ప్రకారం, వాహన తనిఖీల సందర్భంగా ఓ వ్యక్తిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా అతను మద్యం తాగినట్లు నిర్ధారణ అయింది. దీనిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. నేరాన్ని ఒప్పుకున్న వ్యక్తికి మెజిస్ట్రేట్ జరిమానా విధించగా, ఆయన వెంటనే జరిమానా చెల్లించారు.
ఇక కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ కె. నరేష్ పర్యవేక్షణలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం 9 మంది మద్యం తాగినవారిగా పట్టుబడ్డారు. వారినీ బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించి మద్యం సేవించినట్లు రుజువు చేసిన తర్వాత కోర్టుకు హాజరుపరచగా, వారు నేరాన్ని అంగీకరించి జరిమానాలు చెల్లించారు.
పాల్వంచ టౌన్ ఎస్హెచ్ఓ కె. సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒకరు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా నిర్ధారణ చేయగా, కోర్టులో కేసు ప్రవేశపెట్టగా నిందితుడు నేరాన్ని అంగీకరించి జరిమానా చెల్లించాడు.
అలాగే కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ టి. రమేష్ కుమార్, ఎస్ఐలు మహమ్మద్ కె.ఎం. అలీ ఖాన్, బి. కిషోర్, అప్పటి సబ్ఇన్స్పెక్టర్ ఎం. సెల్వరాజ్ల బృందం వాహన తనిఖీలు చేపట్టగా, 15 మంది మద్యం తాగిన స్థితిలో వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. వారందరిని కోర్టుకు హాజరుపర్చగా, నేరాన్ని అంగీకరించి జరిమానాలు చెల్లించారు.
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా పోలీసులు రోడ్డుప్రమాదాలను నివారించే దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం అయింది.
Post a Comment