కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. 5 మంది మృతి
హైదరాబాద్, ఉప్పల్ రామంతపూర్ గోఖలే నగర్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విషాదకర మలుపు తిప్పాయి. శోభాయాత్రలో పాల్గొంటున్న రథం విద్యుత్ తీగలకు తగలడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. రథాన్ని తోసుకుంటూ వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
మృతులు కృష్ణ యాదవ్ (24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి గా గుర్తించారు. వీరంతా ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొంటున్న సమయంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.
అదే సమయంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. ఆ ప్రాంతంలో మృతుల కుటుంబాల్లో శోకసంద్రం నెలకొంది. ఆనందోత్సవంగా ప్రారంభమైన కృష్ణాష్టమి వేడుకలు ఒక్కసారిగా విషాద మయమయ్యాయి.

Post a Comment