-->

మేడారం గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ…

మేడారం గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ…


 జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన సమ్మక్క–సారలమ్మ జాతరలు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సమ్మక్క–సారలమ్మ జాతరలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం సాయంత్రం మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులు కన్నెగూడ ప్రాంతంలో రహస్య పూజలు నిర్వహించి, డప్పుల చప్పుళ్లు, మహిళల మంగళహారతులు, శివసత్తుల పూనకాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య సారలమ్మను గద్దెలపైకి తీసుకువచ్చారు.

సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో జాతర తొలి ఘట్టం అధికారికంగా ఆవిష్కృతమైంది. కన్నెగూడగా పిలువబడే ప్రాంతం నుంచి సమ్మక్కను గద్దెలపై ప్రతిష్ఠించగా, పగిడిద్ద రాజు, గోవింద రాజులను కూడా గద్దెలపైకి తీసుకురావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో గద్దెల వద్దకు చేరుకొని దేవతల దర్శనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెలకు తీసుకురానున్నారు.

జిల్లాలోని అంతర్గాం మండలం గోదావరి తీరంలోని గోలివాడ, గోదావరిఖని గంగ బ్రిడ్జి, మానేరు తీరంలోని సుల్తానాబాద్‌ మండలం నీరుకుల్ల, ఓదెల మండలం కొలనూర్‌, కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట్‌, పెద్దరాతుపల్లి, కమాన్‌పూర్‌ మండలం గుండారం, ముత్తారం మండలం మైదుబండ, పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, హన్మంతునిపేట, పెద్దకల్వల, పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి, వేమునూర్‌, రాణాపూర్‌, ధర్మారం మండలం ధర్మారం, ఎర్రగుంటపల్లి, కటికెనపల్లి, నందిమేడారం, చామనపల్లి, దొంగతుర్తి, నర్సింగాపూర్‌, ఎలిగేడు మండలం లాలపల్లి, ఎలిగేడు, తేలుకుంట, జూలపల్లి మండలం అబ్బాపూర్‌, సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి, నారాయణపూర్‌, తొగర్రాయి, ఓదెల మండలం గుంపుల తదితర ప్రాంతాల్లో జాతరలు ప్రారంభమయ్యాయి.

ఈ జాతరలకు జిల్లాలోని పలు గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 34 చోట్ల జరుగుతున్న ఈ జాతరలకు 15 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

గోదావరిఖని గంగ బ్రిడ్జి వద్ద నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ జాతరను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌, మనాలీ ఠాకూర్‌ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులచే సమ్మక్క–సారలమ్మలకు అభిషేకాలు, వడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “రెండో మేడారంగా పేరొందిన గోదావరిఖనికి లక్షలాది మంది భక్తులు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం” అని తెలిపారు.

కాల్వశ్రీరాంపూర్‌, పాలకుర్తి, అంతర్గాం, ఓదెల, సుల్తానాబాద్‌, మంథని మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో గద్దెలకు పూజలు చేసిన అనంతరం కోయ పూజారులు సారలమ్మను అత్యంత భక్తిశ్రద్ధలతో గద్దెలకు తీసుకువచ్చారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఓదెల మండలంలో జాతర స్థలం నుంచి కిలోమీటర్‌ దూరంలో ఉన్న ధనగుట్ట నుంచి పసుపు, కుంకుమ, కంకణాలతో శోభాయాత్రగా సారలమ్మను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. కిలోమీటర్‌ పొడవున శివసత్తుల మధ్య ఘన స్వాగతం లభించింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793