టేకులపల్లి గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాలు అందజేసిన నవ లిమిటెడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని జిల్లా గ్రంథాలయ శాఖకు నవ లిమిటెడ్, పాల్వంచ సంస్థ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ యల్. వీరభద్రం హాజరయ్యారు.
ఈ సందర్భంగా టేకులపల్లి శాఖ గ్రంథాలయ లైబ్రేరియన్ నాగన్న మాట్లాడుతూ, టేకులపల్లి గ్రంథాలయంలో పోటీ పరీక్షల పుస్తకాల కొరత ఉన్న నేపథ్యంలో నవ లిమిటెడ్ యాజమాన్యాన్ని సంప్రదించామని తెలిపారు. వారు తక్షణమే స్పందించి పుస్తకాలను అందజేయడం అభినందనీయమని పేర్కొంటూ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్య అతిథి తహసీల్దార్ యల్. వీరభద్రం మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో యువతకు పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలను అందించడం ద్వారా నవ లిమిటెడ్ మంచి సేవ చేస్తున్నదని అభినందించారు.
ఈ కార్యక్రమంలో టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు, ఉప సర్పంచ్ ఏ. వసంత, నవ లిమిటెడ్ డీజీఎం ఏ.జి. శంకర్, సీఎస్ఆర్ మేనేజర్ సి.హెచ్. శ్రీనివాసరావు, సిబ్బంది వెంకటేశ్వర్లు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువత కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Post a Comment