పాఠశాలలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఉపాధ్యాయులు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలలోనే రక్తం కారేలా కొట్టుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాలలో ప్రొసీడింగ్స్ విషయంలో వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో టీచర్స్ మీటింగ్లో ఉపాధ్యాయులు నంద్యాల శ్రీనివాస్, రామోజీ శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసి ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో రామోజీ శ్రీనివాస్ ముక్కుపై తీవ్ర గాయం కాగా రక్తస్రావం జరిగింది. వెంటనే ఆయనను నసురుల్లాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, తనపై దాడి చేసిన నంద్యాల శ్రీనివాస్తో పాటు హెడ్మాస్టర్ ఆనంద్ తన ఫోన్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకున్నారని బాధిత ఉపాధ్యాయుడు రామోజీ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై నంద్యాల శ్రీనివాస్ మరియు హెడ్మాస్టర్ ఆనంద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. రాఘవేంద్ర తెలిపారు.

Post a Comment