రాజన్న జిల్లాలో బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం
ప్రమాదకర కేసును పరిష్కరించిన పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఎలాంటి ఆధారాలు లేకున్నా, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోలీసులు కేసును చేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సింగారపు మధు, లాస్య దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. లాస్యకు మతిస్థిమితం లేకపోవడంతో ఆమె తన కూతురు అద్విత (4) తో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చింది.
దర్శనం కోసం వచ్చిన మహబూబాబాద్కు చెందిన ముగ్గురు మహిళలతో లాస్యకు పరిచయం ఏర్పడింది. ఐదు రోజులుగా ఆలయ ఆవరణలో నిద్రిస్తూ మొక్కులు తీర్చుకుంటున్న సమయంలో, లాస్య మతిస్థిమితం లేని కారణంగా పాపను సరిగ్గా చూసుకోవడం లేదని గమనించిన మహిళలు, డిసెంబర్ 23న లాస్యను నమ్మించి పాపను తీసుకెళ్లారు.
బాలిక అదృశ్యం కావడంతో ఆమె మేనమామ పాలమూరు గంగస్వామి, డిసెంబర్ 30న వేములవాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ, ఈ కేసును చాలెంజ్గా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో, వేములవాడ సీఐ వీరప్రసాద్, ఎస్ఐలు, మరియు స్పెషల్ టీమ్ల సహకారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేములవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్ల సీసీ ఫుటేజీ పరిశీలించారు. దర్యాప్తులో బాలిక మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు.
గ్రామ ఉపసర్పంచ్ సహకారంతో, నిందితులైన శ్రీరామోజీ వెంకట నరసమ్మ, గంభీరపు అంజవ్వ, కూనపురి ఉప్పలమ్మలను అదుపులోకి తీసుకుని బాలికను కాపాడారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
ఈ కేసును విజయవంతంగా పరిష్కరించిన పోలీసులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, సీఐలు వీరప్రసాద్, సదన్కుమార్, ఎస్సైలు సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment