తల్లి సమాధి వద్దే మూడు రోజులుగా యువతి నివాసం – కరీంనగర్లో కలకలం
కరీంనగర్: డిసెంబర్ 02: కరీంనగర్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కబరస్తాన్ (స్మశానం) లో ఓ యువతి గత మూడు రోజులుగా తన తల్లి సమాధి వద్దే రోజూ రాత్రీ గడుపుతూ స్థానికులను కుదిపేసింది. తల్లిని కోల్పోయిన బాధను తట్టుకోలేక యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సమాధి వద్దే రోజంతా కూర్చోవడం, రాత్రిళ్లు అక్కడే నిద్రించడంతో స్థానికులు షాక్కు గురై, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కానీ యువతి వెళ్లేందుకు నిరాకరించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.
ఇంటిమంది, గ్రామస్తులు ఎంతగా ఒప్పించినా యువతి సమాధిని వదిలి వెళ్లడానికి ఇష్టపడకపోవడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది.
ఇదే విషయంపై స్పందించిన షీ టీమ్స్, సఖి టీం, మరియు మహిళా సంక్షేమ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని యువతిని కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వైద్య సహాయం అందించడానికి చర్యలు ప్రారంభించారు.
సమాజ సేవకులు, మానవతావాదులు యువతికి మానసిక ఆరోగ్య చికిత్స మరియు సురక్షిత పర్యవేక్షణ అత్యవసరమని సూచిస్తున్నారు. స్థానికులు ఈ ఘటనను హృదయవిదారకంగా అభివర్ణిస్తూ, యువతి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Post a Comment