-->

మొహర్రం ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం

మొహర్రం ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం


హైదరాబాద్: ఈ నెలలో జరగనున్న పవిత్ర మొహర్రం పండుగను పురస్కరించుకుని రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పండుగ సందర్భంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించడమే ఈ సమావేశ లక్ష్యం.

ఈ సమావేశంలో భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, వాటర్ వర్క్స్, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు వంటి కీలక అంశాలపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని సూచించారు.

సమావేశానికి ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మైనుార్టీ వెల్ఫేర్ సెక్రటరీ అస్మిన్ భాష, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పండుగ సందర్భంగా మత సామరస్యానికి భంగం కలగకుండా, అన్ని వర్గాల మధ్య సమన్వయంతో పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ప్రాంతంలో ముందస్తు పర్యవేక్షణతో సమస్యలు ఉండకుండా చూసేందుకు అధికారుల నియామకం, కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

అంతేగాక, పండుగ సందర్భంలో జరిగే బానెం ప్రదర్శనలు, ఊరేగింపులు, మరియు ఇతర ఆచారాల నిర్వహణకు అవసరమైన అనుమతులు, సౌకర్యాలు వెంటనే అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

మొహర్రం పండుగను శాంతియుతంగా, విశ్వాసంతో జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

Blogger ఆధారితం.