-->

పెనుబల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం పంచాయతీ కార్యదర్శి మృతి

పెనుబల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం పంచాయతీ కార్యదర్శి మృతి


ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది.

వివరాల్లోకి వెళితే, స్కూటీపై విధులకు వెళ్తున్న పంచాయతీ కార్యదర్శి బాణోత్ సోనాలి (33) ను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వచ్చిన లారీ స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టి ఆమె శరీరంపై నుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలంలో ఆమె శరీర భాగాలు చితికిపోయి కనిపించడం దృశ్యాన్ని చూస్తున్న వారిని కలచివేసింది.

మృతురాలు పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సోనాలి, ఆ రోజు కాల్లూరు మండలం నుంచి స్కూటీపై విధులకు హాజరుకావడానికి పెనుబల్లి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పెరిగిన రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని సంతాపం తెలిపారు.

Blogger ఆధారితం.