జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ – రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం
అమరావతి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానెల్ లో ప్రసారమైన డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు (“అమరావతి రాజధాని కాదు.. వేశ్యల రాజధాని”) తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కొమ్మినేని శ్రీనివాస్ మద్దతుగా వ్యాఖ్యానించారని ఆరోపణలతో ఆయనపై కూడా కేసు నమోదైంది.
తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు నిన్న సాయంత్రం నమోదు కాగా, ప్రత్యేక బృందాలు హైదరాబాద్కు చేరుకుని ఈ రోజు ఉదయం కొమ్మినేని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం విజయవాడకు తరలించి, అక్కడి నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లే కార్యక్రమం కొనసాగుతోంది. కేసులో ఉన్న సెక్షన్లు నాన్బెయిలబుల్ కావడంతో అరెస్ట్ చర్యలు త్వరితగతిన చేపట్టినట్లు తెలుస్తోంది. అతడిని గుంటూరు లేదా మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
కేసు నేపథ్యం:
ఈ ఘటనకు మూలకారణం జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన తీవ్ర వ్యాఖ్యలు. అమరావతి మహిళలపై ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం రేకెత్తించాయి. మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలు వ్యక్తం చేశాయి. అమరావతి ప్రాంత మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. పలువురు మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయగా, తుళ్లూరు స్టేషన్లో నమోదైన ఫిర్యాదులో, కృష్ణం రాజును సమర్థిస్తూ మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాస్పైనా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు.
చట్టపరమైన చర్యలు:
పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించారు. డిబేట్ వీడియోను విశ్లేషించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిబంధనలు, ఐటీ చట్టం కింద నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అంగీకారంతో వెంటనే అరెస్ట్ ప్రక్రియ చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు:
ఈ వ్యవహారంపై విపక్షాలతోపాటు అధికార పార్టీకి చెందిన నేతలూ స్పందిస్తున్నారు. మహిళల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉన్న జర్నలిస్టులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం అంటూ పలువురు విమర్శిస్తున్నారు. సంఘాల డిమాండ్ – “అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.”
Post a Comment