రూ.10 లక్షల లంచంతో రెడ్హ్యాండెడ్గా ఐఏఎస్ అధికారి అరెస్ట్
భువనేశ్వర్: ఒడిశాలోని కలహండి జిల్లాలో ఒక యువ ఐఏఎస్ అధికారి లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. 2021 బ్యాచ్కు చెందిన ధీమాన్ చక్మ అనే అధికారి, ప్రస్తుతం ధర్మగఢ్ సబ్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆదివారం తన అధికార నివాసంలో రూ.10 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో విజిలెన్స్ శాఖ అధికారుల చేతికి చిక్కారు.
వ్యాపారిని బెదిరించి రూ.20 లక్షలు డిమాండ్
విజిలెన్స్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ధీమాన్ చక్మ ఒక వ్యాపారిని ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటానని బెదిరించి మొత్తంగా రూ. 20 లక్షల లంచం కోరినట్లు తెలిసింది. వ్యాపారి ముందుగా రూ.10 లక్షలు చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బు చెల్లించే సందర్భంలో విజిలెన్స్ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశారు.
అధికార నివాసంలోనే పట్టివేత
విజిలెన్స్ అధికారులు వ్యాపారితో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించి, ఆదివారం ఉదయం తన అధికార నివాసంలో మిగిలిన రూ.10 లక్షల లంచం తీసుకుంటున్న ధీమాన్ను అడ్డంగా పట్టుకున్నారు. లంచం డబ్బును తన టేబుల్ డ్రాయర్లో పెట్టే ప్రయత్నంలో ఉన్న సమయంలోనే అధికారులు రెడ్హ్యాండెడ్గా దొరికించేశారు.
73 లక్షల నగదు స్వాధీనం
ఈ దాడిలో అధికారుల చేతికి రూ.10 లక్షల లంచంతో పాటు, మరో 26 బండిళ్లలో ఉన్న డినామినేషన్ల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సోదాలు కొనసాగించగా, అధికార నివాసంలో అదనంగా రూ.47 లక్షల నగదు కూడా లభ్యమైంది. మొత్తం రూ.73 లక్షల నగదు అధికారుల దర్యాప్తులో బయటపడింది.
అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు
ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం - 2018లోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. లభ్యమైన నగదు మూలాలు, ఇతర ఆస్తుల వివరాల కోసం విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఆందోళన కలిగిస్తూ, ఐఏఎస్ అధికారుల పరిపాలనపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
Post a Comment