తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ముస్లింలకు మంత్రి పదవులు కల్పించకపోవడాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎండి షాదుల్లా తీవ్రంగా విమర్శించారు. ఇటీవల జరిగిన రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కూడా ముస్లిం నాయకులకు అవకాశాలు కల్పించకపోవడం ముస్లిం మైనారిటీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశను కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
షాదుల్లా మాట్లాడుతూ –"ముస్లిం మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాగానే మైనారిటీలను పూర్తిగా పక్కన పెడుతోంది. ఇదే దారిలో మంత్రివర్గ విస్తరణను కూడా మైనారిటీలను విస్మరించి కొనసాగించడమంటే, ఈ ప్రభుత్వం మైనారిటీ సమాజాన్ని అగౌరవపరుస్తోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది," అని పేర్కొన్నారు.
సీనియర్ నేతల విస్మరణపై ఆవేదన
మాజీ మంత్రి షబ్బీర్ అలీ మరియు డా. రియాజ్ వంటి సీనియర్ ముస్లిం నేతలకు పదవులు కేటాయించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉన్న షబ్బీర్ అలీ, నిజామాబాద్ నుండి పోటీ చేసి తన రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసి, పార్టీ కోసం పోరాడారు. అలాంటి నేతకు కనీసం ఎమ్మెల్సీ పదవిలోనైనా అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టడం దారుణం," అన్నారు.
అలాగే డా. రియాజ్ కూడా పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో సేవలందించి, ముస్లిం బీసీలకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు.
"ఈ ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బీసీ ముస్లిం నేతలు. పార్టీకి శ్రమించి కూడా వారికి పదవులు ఇవ్వకుండా, కేవలం నామినేటెడ్ పోస్టుల మాటలతో తప్పించుకోవడం అన్యాయమే కాకుండా, అవమానకరం కూడా," అని ఆరోపించారు.
“రాజకీయ నాయకత్వం లేకుండా చేసే కుట్ర”
షాదుల్లా విమర్శిస్తూ అన్నారు –
"నాటి కేసీఆర్ మాదిరిగా, నేడు రేవంత్ రెడ్డి కూడా ముస్లిం నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఓటు తీసుకునే సమయంలో మైనారిటీలను ముందుకు తీసుకొస్తున్నారు. కానీ అధికారంలో వచ్చాక మాత్రం వారిని పక్కనేస్తున్నారు. ఇది ముస్లిం సమాజాన్ని రాజకీయాల నుండి తప్పించాలన్న ప్రయత్నమే."
ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను రెండో శ్రేణి పౌరులుగా చూడడమే కాకుండా, వారికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకూడదనే దురుద్దేశంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ నేత ఎండి షాదుల్లా
Post a Comment