సోదరునికి రాఖీ కట్టేందుకు బయల్దేరి… రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
సిద్దిపేట కమాన్: రక్షాబంధన్ పర్వదినం కుటుంబాన్నే కుదిపేసింది. సోదరునికి రాఖీ కట్టేందుకు వచ్చిన యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శనివారం సిద్దిపేట పట్టణ శివారులో జరిగింది.
చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి పర్షరాములు కుటుంబం గజ్వేల్లో నివసిస్తోంది. కూతురు శృతి (24) ఎం.ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా తల్లి పల్లవి, మేనమామ నాగిళ్ల శ్రీనివాస్తో కలిసి సిద్దిపేటకు వచ్చింది. అక్కడి నుంచి నంగునూర్ మండలం నర్మెట గ్రామానికి బయల్దేరారు.
రాజీవ్ రహదారిపై కారు టైరు పంక్చర్ కావడంతో రోడ్డు పక్కకు ఆపిన సమయంలో, వెనుకనుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ రాజధాని బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న శృతి తలకు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. పల్లవి, శ్రీనివాస్లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post a Comment