పండుగ వేళ విషాదం.. ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం
తెలంగాణ, జనవరి: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
గాయపడిన వారిని వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment