-->

మేడారం సమ్మక్క–సారక్క జాతరకు కేంద్ర మంత్రుల ప్రత్యేక దర్శనం

తల్లులకు మొక్కులు చెల్లించిన జువల్ ఓరం, కిషన్ రెడ్డి


సమ్మక్క–సారక్క పేరుతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు

మేడారం (ములుగు జిల్లా): ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారక్క మహాజాతర సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర బొగ్గు–గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గురువారం ఉదయం ప్రత్యేకంగా వనదేవతలను దర్శించుకుని మొక్కులు సమర్పించారు.

రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ఆలయ ప్రధాన ద్వారం వద్ద కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ డోలు–డప్పుల మోతల మధ్య పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులను ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు.

గిరిజనుల మహాకుంభ్ – జువల్ ఓరం

మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి జువల్ ఓరం, సమ్మక్క–సారక్క జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా, గిరిజనుల మహాకుంభ్‌గా నిలుస్తోందని అన్నారు. సుమారు 20 ఏళ్ల క్రితం తాను మేడారం వచ్చినట్లు గుర్తు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మళ్లీ ఈ పవిత్ర జాతరకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందిస్తోందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు పాత మిత్రుడని, పార్లమెంటులో కలిసి పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు.

గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో భాగంగా

  • ధర్తీ ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద రూ.లక్ష కోట్లు,
  • పీఎం జన్-మన్ యోజన కింద రూ.24,000 కోట్లు,
  • తెలంగాణకు 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో గిరిజన వ్యవహారాల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పడి, తొలి కేబినెట్ మంత్రిగా తాను బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. భగవాన్ బిర్సా ముండా వంటి గిరిజన వీరుల త్యాగాలను దేశం గౌరవిస్తోందని పేర్కొన్నారు.

సమ్మక్క–సారక్క పేరుతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం – కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సమ్మక్క–సారక్క జాతర గిరిజన ప్రజల అతిపెద్ద పండుగగా, నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు మేడారానికి తరలివస్తారని తెలిపారు.

జాతర ఏర్పాట్లలో భాగస్వాములైన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

  • ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, బొగత జలపాతం పర్యాటకాభివృద్ధికి రూ.80 కోట్లు,
  • రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ.140 కోట్లు,
  • ఈ ఏడాది జాతర నిర్వహణకు రూ.3.70 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.

అలాగే సమ్మక్క–సారక్క పేరుతో రూ.890 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుండగా, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వినతిపత్రం అందజేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793