మేడారం సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పూర్తి
ఆదివాసీల అతిపెద్ద పండుగగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ పుణ్యక్షేత్రం పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ చారిత్రాత్మక క్షేత్రాన్ని ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా మేడారం చేరుకుని సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి ఆశీర్వాదం పొందారు.
దాదాపు వెయ్యేళ్ల వీరగాథకు, ఆదివాసీ జాతి వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచేలా మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణం పునరుద్ధరణ జరిగింది. సంప్రదాయ వైభవం, చారిత్రక విశిష్టత ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్న గద్దెలను పునఃప్రారంభించిన అనంతరం సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందు గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పైలాన్ను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు.
మేడారం పుణ్యక్షేత్రం పునరుద్ధరణతో జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు మరింత సౌకర్యాలు కలగనున్నాయని ప్రభుత్వం తెలిపింది.

Post a Comment