అత్తను కరెంట్ షాక్తో చంపేందుకు యత్నించిన అల్లుడు
జగిత్యాల జిల్లా జగదేవ్పేట గ్రామంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో అత్తను హతమార్చేందుకు అల్లుడు ప్రయత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పద్మ అనే మహిళ తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. అనంతరం తన భార్యను తిరిగి కాపురానికి పంపించాలని పలుమార్లు అడిగినా అత్త రాజవ్వ ఒప్పుకోకపోవడంతో అల్లుడు మల్లారెడ్డి (48) తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఈ క్రమంలో అత్త రాజవ్వపై కోపం పెంచుకున్న మల్లారెడ్డి ఆమెను హతమార్చాలని పన్నాగం పన్నాడు. రాజవ్వ నివసిస్తున్న ఇంటి తలుపులకు విద్యుత్ సరఫరా అయ్యేలా వైర్లు అమర్చాడు. ఉదయం సమయంలో తలుపులు తెరవడానికి ప్రయత్నించిన రాజవ్వకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అల్లుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment