ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్: జూలై 1 నుంచి 11% ఫిట్మెంట్ అమలు
ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్: జూలై 1 నుంచి 11% ఫిట్మెంట్ అమలు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్-2021 కింద 11 శాతం ఫిట్మెంట్ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
సచివాలయంలో నిర్వహించిన టీజీఎస్ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అలాగే ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.
శంకర్ కుటుంబానికి రూ.1 కోటి సాయం
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతో రూ.1 కోటి చెక్కును అందజేయాలని మంత్రి సూచించారు. అదనంగా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాద బీమా పథకం కింద ఇప్పటికే 11 కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున సాయం అందించినట్లు తెలిపారు.
30 నెలల్లో ఆర్టీసీ పురోగతి
- 2023-26 మధ్య రూ.1,078 కోట్ల వ్యయంతో 2,815 కొత్త బస్సుల కొనుగోలు.
- బ్రెడ్ విన్నర్ స్కీమ్, మెడికల్ ఇన్వాలిడేషన్ కింద 1,137 కారుణ్య నియామకాలు.
- తొలగించబడిన 490 మంది ఉద్యోగుల్లో 244 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం.
- మిగిలిన కారుణ్య నియామకాలు, ఉద్యోగుల కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు.
బస్ స్టేషన్లు, డిపోల అభివృద్ధి
నాగర్కర్నూల్, పెద్దపల్లి బస్ డిపో పనులను వేగవంతం చేయాలని, ములుగు బస్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. వేములవాడ, కథలాపూర్, హుజూర్నగర్, కోదాడ, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎలక్ట్రిక్ బస్సులపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం రాష్ట్రంలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. వాటి పనితీరు, లాభనష్టాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. కాలుష్య నియంత్రణ, ఈవీ విధానాలపై దక్షిణ భారత రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుదల
ప్రభుత్వ చర్యల వల్ల ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని మంత్రి పేర్కొన్నారు.
- సీఎస్ఎస్ బకాయిలు రూ.1,096.90 కోట్ల నుంచి రూ.862 కోట్లకు తగ్గాయి.
- పీఎఫ్ బకాయిలు రూ.2,018.15 కోట్ల నుంచి రూ.1,714.39 కోట్లకు తగ్గాయి.
- ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ బకాయిలు కూడా రూ.493.02 కోట్ల మేర తగ్గినట్లు తెలిపారు.
జూలై 1 నుంచి 11 శాతం ఫిట్మెంట్ అమలు కానుండటంతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Post a Comment