-->

ఒకే ద్విచక్ర వాహనంపై 233 ట్రాఫిక్ చలాన్లు మొత్తంగా రూ.45,350 జరిమానా

ఒకే ద్విచక్ర వాహనంపై 233 ట్రాఫిక్ చలాన్లు మొత్తంగా రూ.45,350 జరిమానా


వరంగల్ ట్రాఫిక్ పోలీసులను ఆశ్చర్యపరిచే ఘటన కాజీపేటలో చోటు చేసుకుంది. నగరంలోని హన్మకొండకు చెందిన వ్యక్తి వాడుతున్న ద్విచక్ర వాహనంపై ఏకంగా 233 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ మొత్తం జరిమానా విలువ రూ.45,350!

ఈ తనిఖీలు వరంగల్ పోలీస్ కమిషనర్‌ ఆదేశాల మేరకు నిర్వహించబడ్డాయి. కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేస్తుండగా, హన్మకొండకు చెందిన అస్లం అనే వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అనూహ్యంగా అంతటి పెండింగ్ జరిమానా బయటపడింది.

ఇలాంటి పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి చలాన్లు జారీ చేసినప్పటికీ, అస్లం వాటిని ఒక్క దానికీ చెల్లించకపోవడంతో మొత్తంగా భారీ మొత్తంలో పెండింగ్ ఏర్పడింది. దీంతో, జరిమానా మొత్తాన్ని చెల్లించే వరకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకన్న తెలిపారు.

వాహనదారుడి నిర్లక్ష్యం.. వాహనం మించి జరిమానా!

ఈ ఘటనపై స్థానికులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. అస్లం వాడుతున్న వాహనం సుమారు 20 ఏళ్ల పాతదని, ఇప్పుడు అమ్మినా రూ.10,000 కూడా రావని తెలిపారు. వాహనదారుడు ఇలా చెప్పినట్లు సమాచారం –

ఇప్పుడేం లాభం సారు? ఓ పది వేలు చెల్లించండి, నెల తర్వాత మళ్లీ కట్టాల్సిందే. బండి విలువ కంటే జరిమానా ఎక్కువ అయింది. డబ్బు కట్టలేను. బండి మీ దగ్గరే ఉంచుకోండి!”

ఈ వ్యాఖ్యలు చూస్తే అస్లం జరిమానా కట్టకుండా బండిని పోలీసులే వదిలేసేలా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని వేల రూపాయలతో ఇంకో వాహనం కొనుగోలు చేయగలుగుతానన్న ధీమాతో అస్లం బండి తిరిగి పొందేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

పోలీసుల హెచ్చరిక

ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేస్తూ, తరచుగా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఈ తరహా జరిమానాలు తప్పవని పేర్కొన్నారు. వాహనాలను వాడే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, చలాన్లను సమయానికి చెల్లించాలి, లేదంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మొత్తంగా, ఓ పాత బండి వల్ల వాహనదారుడికి నష్టం ఏమి లేకపోయినా, ప్రభుత్వానికి జరిమానా రూపంలో వచ్చిన నష్టాన్ని ఎప్పటికైనా చెల్లించాల్సిందే అన్నది పోలీసుల అభిప్రాయం.

Blogger ఆధారితం.