తహసీల్దార్ ఆఫీసులో విరిగిన కుర్చీకి "ఫైలు – ఇటుక" సపోర్టు
మంచిర్యాల జిల్లా నెన్నెల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సందర్శించే ప్రజలకు నిరాశ కలిగే దృశ్యం ఎదురైంది. అక్కడ ఉన్న ఓ స్టీల్ కుర్చీ కాళ్లు విరిగి పడిపోవడంతో, అధికారులే దానికి "తాత్కాలిక పరిష్కారం"గా కార్యాలయ ఫైళ్లు, సిమెంట్ ఇటుకలతో సపోర్టు ఏర్పాటు చేశారు.
ఈ దృశ్యం చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభుత్వ కార్యాలయంలో ఎలాంటి సౌకర్యాలు లేవనే భావన కలిగించే ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలు తమ పని కోసం ఆఫీసుకు వచ్చినప్పుడల్లా ఈ విరిగిన కుర్చీపై కూర్చోవడంలో అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. కుర్చీ స్థిరంగా ఉండకపోవడం, ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిపై స్పందించిన పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ, "ఇలాంటి చిన్న సమస్యలను కూడా పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నది బాధాకరం. ప్రభుత్వ కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నిస్తున్నారు.
ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి విరిగిన కుర్చీకి మరమ్మత్తులు చేయించాలన్నదే స్థానికుల విజ్ఞప్తి. ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.
Post a Comment