కొత్తగూడెం, "తల్లిదండ్రులే మీ స్వర్గం, తల్లిదండ్రులే మీ నరకం" అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ 12వ వార్డు, సుభాష్ చంద్రబోస్ నగర్లోని మోడ్రన్ ఇఖ్రా స్కూల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ
"తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగానికి మించినది ఈ లోకంలో ఏమీలేదు. మానవ జీవితంలో తల్లి తండ్రుల పాత్ర అనిర్వచనీయమైనది. మనం ఎదిగిన ప్రతి క్షణం వెనుక వారి ప్రేమ, శ్రమ, త్యాగమే ఉంది. ఖుర్ఆన్ شریفలో పేర్కొన్నట్లుగా, మీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కానీ ఇద్దరూ కానీ వృద్ధాప్యంలో ఉంటే, వారికి ‘ఉఫ్’ అన్న మాట కూడా అనొద్దు, వారిని ధిక్కరించొద్దు, కరుణతో నిమ్రతంగా మాట్లాడండి. వారు బాల్యంలో మీపై చూపిన కరుణను గుర్తు చేసుకుంటూ, ‘ఓ ప్రభూ! నా తల్లిదండ్రులపై కరుణ చూపుము’ అని ప్రార్థించండి అని స్పష్టంగా ఉంది" అన్నారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాక్యాలను ఉదహరిస్తూ —
"నాన్న సంతోషంలోనే దైవ సంతోషం దాగివుంది" అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పేరును సమాజంలో గౌరవంగా నిలబెట్టాలి, వారి ఆశయాలను సాకారం చేయాలని విద్యార్థులను ఉద్దేశించి ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయులు నీలా, ప్రసన్న, శిరీషా, నసరత్, అనితా, విజయలక్ష్మి, సరస్వతి, ఖాజా తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ భావోద్వేగపు సందేశాలను వెలిబుచ్చారు.
పితృ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవం, మమకారం పెంపొందించేందుకు పునాది వేసింది.
Post a Comment