స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు వేగవంతం నెలాఖరులోపు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తథ్యమైపోతున్న సూచనలు స్పష్టమవుతున్నాయి. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరులోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలపై విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. గత ప్రభుత్వ కాలంలో కాలావధి ముగిసిన తర్వాత నూతన పాలకులు ఈ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఉద్యోగుల డిమాండ్లు, హైడర్బాద్ మెట్రో విస్తరణ, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా మొత్తం 56 కీలక అంశాలపై సమగ్ర చర్చ చేపట్టింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని పూర్తి స్థాయిలో చర్చించేందుకు క్యాబినెట్ మరోసారి జూన్ 15న సమావేశంకానుంది.
ఈ భేటీలో స్థానిక ఎన్నికల తేదీలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించినట్టు సమాచారం.
ఇక ఎన్నికల సమీపంలో అధికార కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. గతంలో బీసీలకు ఇచ్చిన హామీ మేరకు, ఈ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ మేరకు పటిష్ట నిర్ణయం తీసుకుని ప్రజల్లో విశ్వాసం పొందాలని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.
ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయపరంగా కీలక మలుపు తిరిగే అవకాశముండగా, అన్ని పార్టీలూ తమ వ్యూహాలను సిద్ధం చేసుకునే దశలోకి ప్రవేశించాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రజాధారిత అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఇది ఒక పెద్ద పరీక్షగా మారనుంది.
Post a Comment