-->

జూలై 19న కొత్త సీజే ప్రమాణ స్వీకారం

జూలై 19న కొత్త సీజే ప్రమాణ స్వీకారం


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ జూలై 19న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏ.కె.సింగ్ రాష్ట్ర హైకోర్టుకు ఏడో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం గత మే నెలలో సిఫార్సు చేయగా, రెండు రోజుల క్రితం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ నియామకాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఇక గత జనవరిలో జస్టిస్ అలోక్ అరాధే బాంబే హైకోర్టుకు బదిలీపై వెళ్లిన అనంతరం సీజే పదవి ఖాళీగానే ఉంది. అప్పటి నుంచి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజోయ్ పాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కోల్కతా హైకోర్టుకు బదిలీ.. నేడు వీడ్కోలు సభ

ఈ క్రమంలో కోల్కతా హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ సుజోయ్ పాల్‌కు నేడు (బుధవారం) ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. మధ్యాహ్నం 3:45 గంటలకు హైకోర్టు ఫస్ట్ కోర్టు హాల్‌లో నిర్వహించనున్న ఫుల్‌కోర్ట్ రెఫరెన్స్ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సుజోయ్ పాల్ 2024 మార్చి 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, ఈ ఏడాది జనవరి 21 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు.

Blogger ఆధారితం.