అంబార్ ప్యాకెట్ ఆధారంగా దొంగలను పట్టుకున్న మంథని పోలీసులు
పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలోని ధర్మారం గ్రామంలో జూన్ 17 తెల్లవారుజామున చోటు చేసుకున్న దొంగతనం కేసును మంథని పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో అంబార్ ప్యాకెట్ కీలక ఆధారంగా మారింది.
అంతర్గత సమాచారం ప్రకారం, తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మి ఇంట్లోకి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. ముందుగా ఇంటి కరెంటును కట్ చేసి, తలుపులు ధ్వంసం చేసి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును బలవంతంగా తీసుకొని పరారయ్యారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో అంబార్ ప్యాకెట్ ఒక ముఖ్య ఆధారంగా మారింది. ఆ ఆధారంతో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు, రాయినేని మల్లయ్య మరియు అతని కుమారుడు రాయినేని అనిల్ లను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు మంథని టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఇటీవల మంథని డివిజన్ పరిధిలో చోటు చేసుకున్న పలు దొంగతనాల కేసులను మా బృందం వేగంగా ఛేదించింది. ఈ కేసులో బ్లూ కోర్టు పెట్రోలింగ్తో పాటు ఐడి పార్టీ ప్రత్యేకంగా పనిచేసింది,’’ అన్నారు.
ఈ సమావేశంలో మంథని ఎస్ఐ డేగ రమేష్, ముత్తారం ఎస్ఐ నరేష్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, అలాగే పోలీస్ సిబ్బంది దువ్వాసి రమేష్, బంగ్లా రాజకుమార్, శివ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment