మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగుల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో బంగారు గొలుసు లాక్కెళ్లిన నిందితులను గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు.
మాటేడు గ్రామానికి చెందిన ముత్యం ప్రేమలీల, రాములు దంపతులు తమ పొలంలో పెసర పంటకు కాపలా కూర్చున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వచ్చి, “ఈ అడ్రెస్ చెబుతారా అమ్మా?” అంటూ ప్రేమలీలతో మాట్లాడారు. ఆ వెంటనే ఆమె మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని వాహనంపై దంతాలపల్లి వైపు పారిపోయారు.
దీన్ని గమనించిన భర్త రాములు గ్రామంలో ఉన్న మహిళా కానిస్టేబుల్కు సమాచారమిచ్చారు. ఆమె పోలీసులకు తెలియజేయగా, వారు వెంటనే రోడ్డుపై వాహనాల తనిఖీ ప్రారంభించారు.
పోలుమల్ల వద్ద పోలీసులను చూసిన దుండగులు వాహనం వదిలి వ్యవసాయ భూముల్లోకి పారిపోయారు. ఒక కోళ్ల ఫారం దగ్గర పొదల్లో దాక్కున్న వారిని రైతులు గుర్తించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరి వెనక మరెవైనా ముఠాలు ఉన్నాయా అనే దానిపై విచారణ కొనసాగుతోంది.
Post a Comment