తెలంగాణలో భారీ వర్షాలు – సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. పలు శాఖల ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని అధికారులకు ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందిని ప్రత్యేకంగా హెచ్చరించారు.
హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక మరియు పోలీసు విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి అని సీఎం సూచించారు.
నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నీటి ప్రవాహం ఉంటే వాహన రాకపోకలను వెంటనే నిలిపివేయాలి అని ఆయన ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
అలాగే, అంటువ్యాధుల వ్యాప్తి నివారణ కోసం పారిశుద్ధ్య చర్యలు అత్యంత అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది నిల్వ నీటిని తొలగించి, పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి, ఆసుపత్రుల్లో సరిపడా మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలి. అవసరమైతే వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలి అని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా నిర్లక్ష్యం జరగకూడదని, ప్రతి శాఖ ప్రజల భద్రత కోసం పూర్తి స్థాయి అప్రమత్తత పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Post a Comment