-->

ప్రమాదానికి గురైన కారు పరిశీలిస్తుండగా వెనుక నుండి లారీ ఢీకొట్టి డ్రైవర్ మృతి

ప్రమాదానికి గురైన కారు పరిశీలిస్తుండగా వెనుక నుండి లారీ ఢీకొట్టి డ్రైవర్ మృతి


శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌పై విషాద ఘటన

శంషాబాద్‌: కారుకు జరిగిన ప్రమాదాన్ని పరిశీలిస్తుండగా వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌పై చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఇన్స్‌పెక్టర్ కె. నరేందర్ రెడ్డి తెలిపారు.

మెదక్‌ పట్టణానికి చెందిన కాముని భరత్‌ (26) అక్కడి వాసి వేముల శేఖర్‌ కుటుంబానికి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున శేఖర్‌ కుటుంబ సభ్యులతో కలిసి కారులో కొల్లాపూర్‌ సింగోటం ఆలయానికి బయలుదేరాడు. పెద్దగోల్కొండ టోలు గేటు దాటిన తర్వాత తుక్కుగూడ వైపుగా ప్రయాణిస్తుండగా పక్కనుంచి ఓ లారీ వచ్చి కారును ఢీకొట్టింది.

ఈ ఢీకొట్టడంతో కారు కుడి భాగం దెబ్బతిని టైరు పగిలిపోయింది. కారు మొరాయించడంతో భరత్‌, శేఖర్‌, అతని కూతురు కిందకు దిగారు. శేఖర్‌ భార్య శోభారాణి ఆరోగ్యం బాగోలేకపోవడంతో కారులోనే కూర్చుంది. వాహనాన్ని పరిశీలిస్తూ భరత్‌ నిలబడి ఉండగా అకస్మాత్తుగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో గుర్తు తెలియని లారీ అతనిపైకి దూసుకొచ్చింది.

ప్ర‌మాదం తీవ్రంగా ఉండడంతో భరత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న శోభారాణికి గాయాలయ్యాయి. శేఖర్‌, అతని కూతురు మాత్రం తృటిలో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793