ప్రకృతి హరిత దీక్షకుడు మహమ్మద్ ఆఫాన్ జైదీని అభినందించిన నటుడు శివరాజ్కుమార్
పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: శ్రీ ప్రవల్లిక ఆర్ట్ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ప్రజల మనిషి గుమ్మడి నరసయ్య సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి కన్నడ చలనచిత్ర సూపర్స్టార్ డాక్టర్ శివరాజ్కుమార్ ప్రత్యేక అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా జరిగిన ఒక హృద్యమైన ఘటన అందరినీ ఆకట్టుకుంది.
కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత సురేష్ రెడ్డి, దర్శకుడు పరమేశ్వర హివ్రాల్, రచయిత పరమేశ్వరతో పాటు ప్రముఖ రాజకీయ నాయకురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో, ప్రకృతి హరిత దీక్షకుడు చిరంజీవి మహమ్మద్ ఆఫాన్ జైదీ పచ్చని మొక్కలు అందజేసి ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు.
అఫాన్ జైదీ చెట్ల సంరక్షణపై తన వినూత్న సందేశంతో "మనం చెట్లను కాపాడకపోతే ఒక రోజు చెట్లనే మనం వీపుపై మోసుకోవలసి వచ్చే పరిస్థితి వస్తుంది" అని ప్రభావవంతంగా చెప్పిన భావం అక్కడ విచ్చేసిన సినీ ప్రముఖులను, అతిథులను ఆకట్టుకుంది. ఈ చిన్నారి పర్యావరణ ప్రేమ, అవగాహన చూసి డాక్టర్ శివరాజ్కుమార్ సహా అందరూ అతన్ని అభినందించారు.
ప్రకృతి ప్రేమికుడు కె.ఎన్. రాజశేఖర్ చేత హరిత దీక్ష తీసుకున్న అఫాన్ జైదీ, ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసలు పొందిన కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. అఫాన్, ముస్తాఫా–పర్వీన్ల మనువడు, అమన్–రేష్మల కుమారుడు.
పర్యావరణ పరిరక్షణ పై చిన్న వయసులోనే నిబద్ధతతో పనిచేస్తూ, ప్రముఖుల మన్ననలు అందుకుంటున్న అఫాన్ జైదీ స్థానికులకు గర్వకారణంగా నిలుస్తున్నాడు.

Post a Comment