ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి
హైదరాబాద్, డిసెంబర్ 03: హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. చాంద్రాయణగుట్టలో రోమాన్ హోటల్ ఎదురుగా నిలిపి ఉంచిన ఓ ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించడం స్థానికులను, పోలీసులను కలవరపరిచింది.
స్థానికులు గుర్తించిన వెంటనే సమాచారం అందించగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతులను మహమ్మద్ జహంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు.
ఘటనాస్థలిలో డ్రగ్స్ ఇంజెక్షన్లు
ఆటోలోని సీట్ల వద్ద పోలీసులు డ్రగ్స్ కు సంబంధించిన ఇంజెక్షన్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో యువకులు స్టెరాయిడ్స్ లేదా నార్కోటిక్ పదార్థాలను అధిక మోతాదులో తీసుకోవడం వల్లే మృతి చెందిన అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసు నమోదు – దర్యాప్తు కొనసాగుతోంది
మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి, సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. యువకులు ఎలా, ఎక్కడ డ్రగ్స్ వినియోగించారో? మరెవరు ఇందులో భాగస్వాములా? వంటి అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత, ఆందోళన నెలకొంది.

Post a Comment