కోడి గుడ్ల ధరలకు రెక్కలు పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్టైమ్ రికార్డు ధరలు
హైదరాబాద్ | డిసెంబర్ 21: కోడి గుడ్ల ధరలు సామాన్యుడిని షాక్కు గురిచేస్తున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు బహిరంగ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య పలికిన కోడి గుడ్డు ధరలు ప్రస్తుతం ఒక్కసారిగా పెరిగి రూ.8కు చేరాయి. హోల్సేల్ మార్కెట్లో అయితే ఒక్కో గుడ్డు ధర రూ.7.30 వరకు పలుకుతుండటం గమనార్హం.
పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఇది అత్యధిక ధరగా పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. గతంలో 30 కోడి గుడ్లు రూ.160 నుంచి రూ.170 వరకు విక్రయించేవారు. అయితే గత 10 రోజులుగా అదే సంఖ్యలో గుడ్లను హోల్సేల్ మార్కెట్లోనే రూ.210 నుంచి రూ.220 వరకు విక్రయిస్తున్నారు.
మరోవైపు నాటు కోడి గుడ్ల ధరలు మరింత పెరిగి ఒక్కో గుడ్డు రూ.15 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలు సామాన్య వినియోగదారులపై తీవ్ర భారం మోపుతున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణం
డిమాండ్కు తగిన ఉత్పత్తి లేకపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు వివరిస్తున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల కోడి గుడ్లు ఉత్పత్తి అయ్యేవని, ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు.
కోడి గుడ్ల ఉత్పత్తికి అవసరమైన దాణా, మక్కజొన్న, చేప పొట్టు వంటి ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో చాలా మంది పౌల్ట్రీ రైతులు కోళ్ల ఫారాల నిర్వహణను నిలిపివేశారని చెప్పారు. దీనివల్ల గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి మార్కెట్లో కొరత ఏర్పడిందని వెల్లడించారు.
ఒకప్పుడు రోజుకు కనీసం 20 కోట్ల కోడి గుడ్లు కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉండేవని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
మరో రెండు నెలలు ఇదే పరిస్థితి?
ప్రస్తుతం హోల్సేల్లో రూ.7.30, రిటైల్లో రూ.8గా ఉన్న కోడి గుడ్ల ధరలు మరో రెండు నెలల పాటు ఇలాగే కొనసాగే అవకాశముందని పౌల్ట్రీ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి పెరిగే వరకు ధరలు తగ్గే సూచనలు లేవని స్పష్టం చేస్తున్నారు.

Post a Comment