-->

✊ ‘నేనే వస్తా’.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన కేసీఆర్

✊ ‘నేనే వస్తా’.. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన కేసీఆర్


హైదరాబాద్, డిసెంబర్ 21: చాలా కాలం విరామం తర్వాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై రాజకీయం మరో మలుపు తిరుగుతుందని స్పష్టం చేస్తూ.. “ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క” అంటూ కాంగ్రెస్ సర్కార్‌కు సూటి హెచ్చరిక జారీ చేశారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. రెండేళ్లు ఓపికగా ఎదురుచూశామని, ఇకపై మాత్రం ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తామని స్పష్టం చేశారు. బహిరంగ సభలు, ప్రజా ఉద్యమాల ద్వారా తానే నేరుగా ప్రజల్లోకి వస్తానని ప్రకటించారు.

🔥 కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రియల్ ఎస్టేట్ దందాలకే పరిమితమైందని కేసీఆర్ మండిపడ్డారు.

  • రైతులు పండించిన వడ్లు కొనేవాడు లేడని
  • యూరియా సరఫరా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని
  • రైతులను ఆగమాగం చేస్తున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ మారిందని ఆరోపించారు.

“తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా? లేక నిద్రపోతుందా?” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భూములు అమ్ముకోవడమే ప్రభుత్వ ధ్యేయంగా మారిందని విమర్శించారు.

🚜 రైతు సమస్యలపై ఉద్యమాలు

రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, ప్రతి విధానాన్ని ప్రజల ముందే నిలదీస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. “ఇంట్లోకి వచ్చి దోచుకుపోతామంటే ఊరుకుంటామా?” అని ప్రశ్నిస్తూ ప్రజా ఉద్యమాలకు పిలుపునిచ్చారు.

🌊 నదీ జలాల కోసం మరో పోరాటం

నదీ జలాల అంశంలో తెలంగాణ హక్కుల పరిరక్షణకు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడతామని, అవసరమైతే భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.“ఇవాళ్టి వరకు ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క. ఎక్కడికక్కడ నిలదీస్తాం.. తోలు తీస్తాం. రాష్ట్ర హక్కుల కోసం ప్రత్యక్ష పోరాటమే మార్గం” కేసీఆర్


🌊 పాలమూరు ద్రోహంపై సంచలన వ్యాఖ్యలు

సమైక్యాంధ్ర కాలంలో మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు టీడీపీ పాలించినా పాలమూరుకు న్యాయం జరగలేదని ఆరోపించారు.

  • కృష్ణా నది మహబూబ్‌నగర్ జిల్లాలో 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని
  • 174 టీఎంసీల నీరు జిల్లాకు రావాల్సి ఉందని
  • విభజన వల్ల పాలమూరుకు భారీ నష్టం జరిగిందని పేర్కొన్నారు.

SRC, బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు.

🏥 సంక్షేమ పథకాలపై ప్రశ్నలు

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని తాము మరింత బలోపేతం చేశామని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.

  • కేసీఆర్ కిట్ ఎందుకు నిలిపేశారని ప్రశ్న
  • బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శ
  • చెక్ డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమని ఆవేదన

“మా హయాంలో కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా పట్టుకొస్తాం” అంటూ హెచ్చరించారు.

📢 భారీ బహిరంగ సభకు సిద్ధం

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడిన కేసీఆర్.. ఈ అంశంపై మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని ఆరోపిస్తూ.. మరో 20 రోజుల్లో పాలమూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటమే లక్ష్యమని, కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793