-->

మున్సిపల్ మేనియా.. రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్!

జనవరి 26న షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ నెలాఖరు నుంచే నామినేషన్లు.. ఫిబ్రవరి 15లోపు ప్రక్రియ పూర్తి చేసే యోచన


హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హీట్ మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధమవుతుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారుకావడం, ప్రభుత్వ వర్గాల నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

రిపబ్లిక్ డే రోజైన జనవరి 26న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా ఈ నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించి, ఫిబ్రవరి 15లోపు పోలింగ్, కౌంటింగ్ సహా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే ప్రణాళికపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.


ప్రచారంలో మంత్రులు.. ఏర్పాట్లలో అధికారులు

ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నమై ఉండగా, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచార పర్వంలోకి దిగారు.
పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
పంచాయతీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలన్న లక్ష్యంతో అధికార పార్టీ వ్యూహాలు రచిస్తుండగా, పట్టణాల్లో తమ బలాన్ని చాటేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.


మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఆశావహుల క్యూ

రిజర్వేషన్ల ఖరారుతో టికెట్ల వేట మొదలైంది. తమ సామాజిక వర్గానికి అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చిన వార్డుల్లో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల నివాసాలు ఆశావహులు, వారి అనుచరులతో కిటకిటలాడుతున్నాయి.

టికెట్ల విషయంలో పోటీ తీవ్రంగా ఉండటంతో అధికార పార్టీలో సమన్వయం పెద్ద సవాలుగా మారింది. ఎవరికైనా టికెట్ ఇస్తే మరొకరు రెబల్‌గా మారే ప్రమాదం ఉండటంతో నేతలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.


ఫిబ్రవరి 1న సీఎం రాక.. వెంటనే జిల్లాల బాట

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
ఆయన రాగానే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరింత ఊపు తెచ్చేలా పార్టీ వర్గాలు షెడ్యూల్ సిద్ధం చేశాయి.

సీఎం వరుసగా జిల్లాల పర్యటనలు చేపట్టనుండగా, భారీ బహిరంగ సభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రచారం సాగనుంది. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు.


జెట్ స్పీడ్‌తో ఎన్నికల షెడ్యూల్

సమయం తక్కువగా ఉండటంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు పరుగులు పెడుతున్నారు.
15–20 రోజుల వ్యవధిలోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో షెడ్యూల్ రూపొందుతున్నట్లు సమాచారం.

శివరాత్రి, రంజాన్ ఉపవాసాల కంటే ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది నియామకం, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై అధికారులు నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీబిజీగా గడుపుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793