భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి… భర్త ఆత్మహత్య
ఖమ్మం జిల్లా: తిరుమలాయపాలెంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రామానికి చెందిన తోటమళ్ల నాగభూషణం గత రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. అనారోగ్యంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన అతను గతంలో కూడా మూడుసార్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా భార్య జయమ్మ అడ్డుకుంది.
అయితే రోజురోజుకు ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతుండటంతో, తనను అడ్డుకుంటున్న భార్యను చంపి తాను కూడా చనిపోవాలని నాగభూషణం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం ముందుగా తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు.
ఇంట్లో నుంచి మంటలు రావడంతో స్థానికులు గమనించి వారి కుమారుడికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న కుమారుడు తల్లిదండ్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.
చికిత్స పొందుతూ నాగభూషణం మృతి చెందగా, జయమ్మ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగభూషణంకు ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం.

Post a Comment