సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని తపన.. యువతకు VC సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే తపనతో యువత ప్రమాదకర స్టంట్లు చేయడం పెరుగుతోందని, ఇది ప్రాణాలకు ముప్పు తెచ్చే చర్య అని పోలీస్ అధికారి VC సజ్జనార్ హెచ్చరించారు.
నడుస్తున్న రైలుకు వేలాడుతూ స్టంట్లు చేయడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలతో ఆటలాడటం చాలా ప్రమాదకరమని అన్నారు.
ఇలాంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల చివరకు ఆస్పత్రి బెడ్ లేదా మరణం తప్ప మరేమీ దక్కదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
“లైకుల కోసం లైఫ్ను రిస్క్ చేయొద్దు. ప్రాణం పోయాక ఆ రీల్స్ ఎవరూ చూడరు. కానీ మీ కుటుంబం మాత్రం జీవితాంతం బాధపడుతుంది” అని యువతకు సజ్జనార్ సూచించారు. ప్రాణాలను ప్రమాదంలో పెట్టే స్టంట్లకు దూరంగా ఉండాలని, బాధ్యతతో ప్రవర్తించాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.

Post a Comment