లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్ఎల్ నడిపితే చర్యలు 140 వాహనాలు సీజ్
కరీంనగర్, ఏప్రిల్ 22: కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ట్రాఫిక్ విభాగం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలు నడుపుతున్న వారిపై దృష్టి సారించారు.
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా, సరైన పత్రాలు లేని మొత్తం 140 వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేశారు. అనంతరం మోటార్ వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్) ప్రకారం జరిమానాలు విధించారు.
ఇంకా, నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి హెచ్చరించారు.
పట్టణంలో రహదారి భద్రతను మెరుగుపరచడానికి ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment