కనీస ధర లేక ఉల్లి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉల్లి రైతుకు కన్నీరు… కిలోకు రూ.4 ధర
హైదరాబాద్, ఏప్రిల్ 22: మార్కెట్లో కనీస ధర లేక ఉల్లి రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటకు సరైన ధర దక్కకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్కు ఉల్లిని తరలించిన రైతులకు క్వింటాల్కు కేవలం రూ.150 నుంచి రూ.300 మాత్రమే ధర పలుకుతోంది. ఈ ధరలు రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో వికారాబాద్ జిల్లాకు చెందిన రైతులు సమీపంలోని వారాంతపు సంతల్లోనే ఉల్లిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ కూడా పరిస్థితి దయనీయంగానే ఉంది. కిలో ఉల్లి ధర రూ.3 నుంచి రూ.4 మాత్రమే ఉండగా, 50 కిలోల బస్తాను సుమారు రూ.200కే అమ్ముకుంటున్నారు.
మర్పల్లి సంతలో పంచలింగాల, పట్లూర్, కంచర్పల్లి, మొగిలిగుండ్ల తదితర గ్రామాల రైతులు ట్రాక్టర్లలో ఉల్లి బస్తాలను తీసుకువచ్చి, తక్కువ ధరకు అమ్మకాలు జరుపుతున్నారు. కష్టపడి పండించిన పంటకు కనీస ధర కూడా రాకపోవడంతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు.
ఇక మరోవైపు అకాల వర్షాలు పంటను దెబ్బతీయడంతో నష్టాలు మరింత పెరిగాయి. అయినా చేసేదేమీ లేక కనీసం కూలీ డబ్బులైనా వస్తాయనే ఆశతో ఉల్లిని అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు.

Post a Comment