సొంత అన్న, వదినను కిరాతకంగా హత్య చేసిన తమ్ముడు
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కుటుంబ కలహాలు విషాదాంతానికి దారి తీశాయి. సొంత తమ్ముడే అన్న, వదినను హత్య చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పురా ప్రాంతానికి చెందిన ఆదిల్ ఖాన్ సోమవారం మధ్యాహ్నం తన అన్న అఖీల్ ఖాన్, వదిన అజ్మేరీ బేగంను కిరాతకంగా హత్య చేశాడు. గత కొంతకాలంగా కుటుంబంలో కొనసాగుతున్న వ్యక్తిగత విభేదాలు ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో కోపోద్రిక్తుడైన ఆదిల్ ఖాన్ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మీర్చౌక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యలకు గల అసలు కారణాలను వెలికితీయడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ డబుల్ మర్డర్ ఘటనతో సుల్తాన్పురా, మీర్చౌక్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల్లో భయాందోళనలు నెలకొనడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

Post a Comment