నేడు క్యాబినెట్ భేటీ ఆర్టీసీ సమ్మె నుంచి మెట్రో స్వాధీనం వరకు కీలక అంశాలపై నిర్ణయాలు?
హైదరాబాద్, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సమ్మె ప్రధాన అజెండాగా ఉండనుంది. కార్మిక సంఘాలు ఉంచిన 32 డిమాండ్లపై మంత్రివర్గం చర్చించి, సమ్మె పరిష్కారానికి మార్గం చూపే అవకాశం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించనున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఎల్ అండ్ టీకు చెల్లించాల్సిన బకాయిలు, రుణాల సమీకరణపై కూడా చర్చ జరగనుంది. ఇందుకోసం సుమారు రూ.13 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సుముఖత తెలిపినట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం తర్వాత రుణ ప్రక్రియ ముందుకు సాగే అవకాశముంది.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకానికి సంబంధించిన విధివిధానాల ఖరారు కూడా ఈ భేటీలో జరగనుంది. జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయమై కోదండరాం, అజారుద్దీన్ పేర్లపై కూడా చర్చించే అవకాశముంది.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం, ధాన్యం సేకరణ, కుల సర్వే (సీపెక్) అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఫిట్మెంట్ వంటి డిమాండ్లపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
మొత్తంగా ఈరోజు క్యాబినెట్ భేటీ రాష్ట్రంలో పరిపాలన, రాజకీయ, ఆర్థిక రంగాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయాలకు వేదిక కావొచ్చని భావిస్తున్నారు.

Post a Comment