దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగుల ఆందోళన కాంగ్రెస్ ప్రభుత్వంవిఫలం
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు మరోసారి ఆందోళనకు దిగారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని అమలు చేయడంలో విఫలమైందని నిరుద్యోగులు ఆరోపించారు.
ఇప్పటికే దిల్సుఖ్నగర్లో నిరసనలు చేపట్టిన నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాల భర్తీ అంశంపై ఆందోళనకారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 5 వేల పోస్టులు సరిపోవని, కనీసం 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డప్పు చప్పుళ్లతో వినూత్నంగా నిరసన తెలుపుతూ, దిల్సుఖ్నగర్ పరిసరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఆందోళనను నియంత్రించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల చర్యలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. ఇదే అంశంపై ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో కూడా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.

Post a Comment